Gruha Lakshmi: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రధానాంశాలు
గృహలక్ష్మి (Gruha Lakshmi ) పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం G.O ను జారీ చేసింది. ఈ పథకానికి బదులుగా ప్రభుత్వం రూ. 5 లక్షలతో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.
ప్రజాపాలన అభయహస్తం పేరుతో కార్యక్రమం
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీల కోసం అర్హులంతా పోటీ పడి దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జనంతో కిక్కిరిసిపోయాయి.
6 హామీల కోసం దరఖాస్తు తీసుకున్నారు. అయితే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుదారులలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రజాపరిపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగింపు
ఈ ప్రజాపరిపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా 6 హామీల దరఖాస్తుకు ప్రభుత్వం గడువు విధించలేదు. అయితే ఈ పథకాలకు పలు ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
అంతే కాకుండా రేషన్ కార్డులు లేని వారికి అవకాశం కల్పిస్తూ వారి నుంచి తెల్లకాగితాలపై అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారికి త్వరలో రేషన్ కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.