Kaleshwaram Project | నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ (NDSA) ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధానాంశాలు
Kaleshwaram Project | నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ (NDSA) ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘ప్రాజెక్టులో భారీ నాణ్యతాలోపం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎలాంటి తనిఖీలు చేపట్టలేదని పేర్కొంది. రూ.81వేల కోట్లకు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఆమోదం ఇచ్చింది, కానీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1.47 లక్షల కోట్లు కావాలి’ అని ఉత్తమ్ వివరించారు.
అన్నారం బ్యారేజీ కుంగే అవకాశం | Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయి. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొంది. అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది. కుంగేలా కనిపిస్తోంది. రిజర్వాయర్లో నీరు నింపొద్దని NDSA సూచించింది. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రం మొత్తం వినియోగంకంటే కాళేశ్వరానికే ఎక్కువ కరెంట్
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని మోటార్లు ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. “తెలంగాణ మొత్తంలో అన్నిరకాల అవసరాలకు 160 మిలియన్ యూనిట్ల కరెంట్ చాలు. రాష్ట్రం మొత్తానికి కావాల్సిన కరెంట్ కంటే కాళేశ్వరానికి ఎక్కువ విద్యుత్ కావాలి. ఏడాదికి కాళేశ్వరానికి రూ.10,375 కోట్ల కరెంట్ ఖర్చు అవుతోంది” అని ఆయన వివరించారు.