తెలంగాణ: దాదాపు డబుల్ సెంచరీ వరకు చేరిన టమాటా ధరకు బ్రేక్ పడింది. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.200 చొప్పున విక్రయించడంతో పేద, మధ్యతరగతి వారు టమాటా కొనుగోలు చేయాలంటేనే కొద్దిరోజులు వెనకడుగు వేశారు. పచ్చిమిచ్చి సైతం కేజీ రూ.150పైగానే పలికింది. దాదాపు నెలన్నర పాటు కూరగాయల ధరలు సామాన్యుడు కొనలేని విధంగా పెరిగాయి. అయితే క్రమంగా వాటి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
కూరగాయల ధరలు వచ్చే నెల నుంచి తగ్గుతాయని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా కొత్త పంటలు అందుబాటులోకి రానుండడంతో ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టం 7.4%కి చేరింది. కూరగాయల రేట్లు పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరగడం తాత్కాలికమే అని.. ధరలు వేగంగా దిగొచ్చే ఛాన్స్ ఉందని ఆర్థికశాఖ పేర్కొంది.